బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న ర‌ష్మిక మంథాన‌.. ఫ‌స్ట్ లుక్‌తో క‌న్‌ఫాం చేసిన మేక‌ర్స్

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌ని మ‌న ముద్దుగుమ్మ‌లు ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకెళుతున్నారు. తెలుగు, త‌మిళం, హిందీ..ఇలా ఎక్కడ ఛాన్స్ వ‌స్తే అక్క‌డ సినిమాలు చేసేందుకు సై అంటున్నారు. వీటితో పాటు వెబ్ సిరీస్ లు, యాడ్స్ , ప్ర‌మోష‌నల్ కార్య‌క్ర‌మాలు ఇలా అన్నింటికి ఓకే చెబుతూ రెండు చేతులు సంపాదిస్తున్నారు.అయితే ఇప్పుడిప్పుడే పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందుతున్న భామ‌ల‌కు బాలీవుడ్‌లో సినిమాలు చేయాల‌ని చాలా కోరిక‌. ఛాన్స్ వ‌స్తే వారు ఒప్పుకోకుండా ఉంటారా మ‌రి..! ఈ నేప‌థ్యంలోనే ర‌ష్మిక మంథాన బాలీవుడ్ సినిమా చేసేందుకు స‌న్న‌ద్ధ‌మైంది.

తెలుగులో న‌టించి స్టార్ స్టేట‌స్ పొందిన ర‌కుల్ ప్రీత్ సింగ్, కాజ‌ల్ అగ‌ర్వాల్, తాప్సీ, శృతి హాస‌న్ వంటి అందాల భామ‌లు బాలీవుడ్‌లో స‌త్తా చాటుతుంటే ఇప్పుడు ర‌ష్మిక కూడా హిందీలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మైంది. ఛ‌లో, గీత‌గోవిందం, భీష్మ, స‌రిలేరు నీకెవ్వ‌రు వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఈ క‌న్న‌డ భామ భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న హిందీ సినిమాలో న‌టించే అవ‌క‌శాం కొట్టేసింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్క‌నున్న మిష‌న్ మ‌జ్ను చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది ర‌ష్మిక‌. బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా లీడ్‌రోల్ పోషిస్తున్నాడు.

పాకిస్థాన్ లో భార‌త సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేప‌ట్టిన అతిపెద్ద కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ లోని వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా, ప్ర‌ముఖ ఫిలిం మేక‌ర్స్ రోన్నీ స్క్రూవాలా, అమ‌ర్ బుటాలా, గ‌రిమా మెహ‌తా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శాంత‌ను బాగ్‌చి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సిని‌మాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి, ర‌ష్మిక ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని చెప్పారు. కాగా, ర‌ష్మిక తెలుగులో అల్లు అర్జున్ స‌ర‌స‌న పుష్ప అనే సినిమా చేస్తుంది.