తండ్రి, కూతుళ్ళ ప్రేమ‌ను చూసి మురిసిపోయిన చిరు.. మీకు నా సెల్యూట్ అంటూ ట్వీట్

సినిమాల‌లో చూపించే కొన్ని సంఘ‌ట‌న‌లు నిజ జీవితాల‌లోను క‌నిపిస్తే మ‌నకు చాలా థ్రిల్ అనిపిస్తుంటుంది. తాజాగా ఓ తండ్రి త‌న క‌న్నా పెద్ద స్థాయిలో ఉన్న కూతురికి సెల్యూట్ చేస్తుండ‌డం ఇప్పుడు అంత‌టా హాట్ టాపిక్‌గా మారింది. వివ‌రాల‌లోకి వెళితే
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పోలీస్ శాఖ మొట్టమొదటి సారిగా ‘పోలీస్ డ్యూటీ మీట్ 2021’ను ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో‌ నిర్వహిస్తోంది. డీజీపీ గౌత‌మ్ సవాంగ్ ఆధ‌ర్వ్యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశంలో అరుదైన దృశ్యం అంద‌రిన ఆక‌ర్షించింది.

2018 బ్యాచ్‌కి చెందిన జెస్సీ ప్రశాంతి.. గుంటూరు అర్బన్ సౌత్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా బాధ్యతలు చేప‌ట్టారు. ఈవిడ తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్‌లో భాగంగా దిశ విభాగంలో బాధ్య‌త‌లు నిర్వ‌రిస్తున్నారు. అలానే ఇదేఏ కార్య‌క్ర‌మానికి తిరుపతి కళ్యాణి డ్యామ్‌ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ (సీఐ)‌గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంతి తండ్రి శ్యామ్ సుందర్ కూడా వచ్చారు. ఇద్ద‌రు ఎదురెదురు ప‌డ‌డంతో త‌న క‌న్నా పెద్ద స్థాయిలో ఉన్న కూతురు అన్న విష‌యం కూడా మ‌ర‌చిపోయి సెల్యూట్ చేశాడు ఆ తండ్రి. దీనికి ప్రశాంతి తండ్రిని చూసి.. ఏంటి నాన్నా, అంటూ గట్టిగా నవ్వేశారు. త‌న కూతురు ఇంత‌టి ప్ర‌యోజ‌కురాలు కావ‌డం సంతోషంగా ఉంద‌ని సీఐ శ్యామ్ సుందర్ గర్వంగా అన్నారు.

ఈ పోలీస్ తండ్రి, కూతుళ్ల అనుబంధాన్ని చూసిన తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అభినంద‌నలు తెలిపారు. అలానే మెగాస్టార్ చిరంజీవి కూడా తండ్రి, కూతుళ్ల‌ని చూసి మురిసిపోయి ఆ ఆనందాన్ని త‌న ట్విట్ట‌ర్‌లో పంచుకున్నారు. ‘ఆ ఫోటోలో ఉన్నది తండ్రి సీఐ శ్యామ్ సుందర్, కూతురు డిఎస్పీ జెస్సి ప్రశాంతి. తన గుండెల మీద ఎత్తుకుని పెంచిన బిడ్డ తనపై అధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి చేసిన సెల్యూట్లో బోలెడంత సంతృప్తిని, గర్వాన్ని, ప్రేమను చూశాను. శ్యామ్ సుందర్‌గారు మీకు నా సెల్యూట్. మీ ఇద్దరు ఇంకెందరికో స్ఫూర్తి’ అన్నారు. ప్ర‌స్తుతం వీరి ఫొటో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది….