జ‌న‌వ‌రి 1న ప‌వ‌న్‌తో, 2న ఎన్టీఆర్‌తో.. త్రివిక్రమ్ స్కెచ్ బాగుందే!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోని స్టార్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రు. ర‌చ‌యిత‌గా త‌న ప్ర‌స్థానం మొద‌లు పెట్టిన త్రివిక్రమ్ ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా వ‌రుస సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యాలు సాధిస్తుండ‌డంతో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. 2020లో అల్లు అర్జున్‌తో అల వైకుంఠ‌పురములో అనే చిత్రాన్ని తెర‌కెక్కించగా, ఈ సినిమాకు కాసుల వ‌ర్షం కురిసింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు త్రివిక్ర‌మ్. కొద్ది రోజులుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.. జ‌న‌వ‌రి 1న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌లిసి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. ప‌వ‌న్‌కు -త్రివిక్ర‌మ్‌కు మ‌ధ్య ఉన్న మంచి బాండింగ్‌తోనే వారిద్ద‌రు క‌లిసిన‌ట్టు తెలుస్తుంది. జ‌ల్సా, అత్తారింటికి దారేది, అజ్ఙాత‌వాసి చిత్రాలు వీరిద్దరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌గా, మ‌రో సినిమా ఎప్పుడు వ‌స్తుందా అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. క‌ట్ చేస్తే ఈ రోజు జూనియ‌ర్‌ని ఎన్టీఆర్‌ని క‌లిసాడు త్రివిక్ర‌మ్. ఎన్టీఆర్‌కు పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన మాట‌ల మాంత్రికుడు కొద్ది సేపు ఆయ‌న‌తో ముచ్చ‌టించి ఫొటోలు దిగారు. ఇవి ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న త్రివిక్ర‌మ్ ఈ సినిమాకు అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే సినిమా షూటింగ్ పూర్తి కాగానే. ఈ ప్రాజెక్ట్‌ను మొద‌లు పెట్ట‌నున్నారు. ఈ చిత్రంపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.