దీపిక ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ల‌న్నీ ఖాళీ.. ఏం జ‌రిగిందంటూ నెటిజ‌న్స్ ఆరా

బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి మ‌నందరికి తెలిసిందే. త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో పాటు సినిమా విష‌యాల‌ను త‌ర‌చు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కు వినోదాన్ని పంచుతుంది. ప్ర‌స్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 52 మిలియ‌న్స్ ఫాలోవ‌ర్స్ ఉండ‌గా, ట్విట్ట‌ర్‌లో 27 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అయితే న్యూ ఇయ‌ర్ వేడుక‌ల కోసం రాజ‌స్థాన్ వెళ్లిన దీపికా ప‌దుకొణే అక్క‌డ చేసిన సంద‌డికి సంబంధించి ఫోటోల‌ని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుందేమో అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో దీపికా పోస్ట్‌ల సంఖ్య జీరోగా క‌నిపించింది.

న్యూ ఇయ‌ర్ రోజు అంద‌రు సెల‌బ్రిటీల సోష‌ల్ మీడియా అకౌంట్స్ ప‌లు పోస్ట్‌ల‌తో ద‌ద్ద‌రిల్లిపోతున్నాయి. మ‌రి దీపికనేమో కొత్త‌వి పెట్ట‌డం ఏమో త‌ర్వాత సంగ‌తి కాని అన్నీ తీసేసి నెటిజ‌న్స్‌కు లేనిపోని అనుమానాలని క‌లిగించింది. అకౌంట్ హ్యాక్ అయిందా లేదంటే దీపిక‌నే అవ‌న్నీ తీసేసిందా అన్న దాంట్లో క్లారిటీ రావ‌డం లేదు. ఈ చర్య వెనుక ఉన్న మ‌ర్మ‌మేంటంటూ నెటిజ‌న్స్ త‌ల‌బాదుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో స్పందించిన దీపిక నూతన సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించాలనే ఉద్దేశంతోనే దీపిక తన పాత పోస్టులన్నింటినీ డిలీట్ చేసిన‌ట్టు చెప్పుకొచ్చింది. ఎన్నో విషయాలు నేర్పిన 2020కి అందరూ రుణపడి ఉండాలని పేర్కొంటూ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపింది.

క‌పిల్ దేవ్ బ‌యోపిక్ 83లో త‌న భ‌ర్త ర‌ణ్‌వీర్ సింగ్‌తో క‌లిసి దీపికా ప‌దుకొణే న‌టించింది. ఈ సినిమా మరి కొద్ది రోజుల‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇక తొలిసారి తెలుగులో ప్ర‌భాస్ మూవీతో అడుగుపెట్టేందుకు సిద్ధ‌మైంది. నాగ్ అశ్విన్ తెర‌కెక్కించ‌నున్న పాన్ ఇండియా మూవీలో దీపికా ప‌దుకొణే క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని కొద్ది రోజుల క్రితం మేకర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమా పీరియాడిక‌ల్ మూవీగా రూపొంద‌నుంది. మ‌రోవైపు షాకున్‌ బాత్రా డైరెక్షన్‌లో కూడా నటిస్తున్నారు దీపికా.