బాలీవుడ్ హీరోతో అర్జున్ డైరెక్ట‌ర్ చిత్రం.. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి ఫుల్ క్రేజ్ పొందారు. అర్జున్ రెడ్డి ఎఫెక్ట్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజీ ఆఫర్స్ పొందుతుండ‌గా, ద‌ర్శ‌కుడు సందీప్ బాలీవుడ్ సినిమాల‌తో బిజీబిజీ అయ్యారు. త‌న రెండో చిత్రంగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో షాహిద్ క‌పూర్ హీరోగా తెరకెక్కించాడు. క‌బీర్ సింగ్ టైటిల్ పేరుతో తెర‌కెక్కిన ఈ మూవీ మంచి విజ‌యం సాధించింది. గ‌త కొద్ది రోజ‌లుగా సందీప్ రెడ్డి వంగా మూడో చిత్రంపై క్రేజీ అప్‌డేట్స్ వ‌స్తున్నాయి.

బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ తో క‌లిసి సందీప్ రెడ్డి వంగా త‌న మూడో చిత్రం చేయ‌నున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్తలు వ‌స్తున్నాయి. ఈ చిత్రానికి యానిమ‌ల్ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. న్యూయ‌ర్ సంద‌ర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్ రానున్న‌ట్టు ప్ర‌క‌టించారు. భూష‌ణ్ కుమార్, కృష‌న్ కుమార్, సందీప్, అత‌ని సోద‌రుడు ప్ర‌ణ‌య్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. గ్యాంగ్‌స్ట‌ర్ నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో ప‌రిణితీచోప్రా క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం.

యానిమ‌ల్ అనే టైటిల్‌ని సందీప్ త‌న తాజా చిత్రానికి ఫిక్స్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌గా, ఈ సినిమాలో అనీల్ క‌పూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ర‌ణ్‌బీర్ క‌పూర్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్రా చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత సందీప్‌తో క‌లిసి ఈ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కాగా, ర‌ణ్‌భీర్ కపూర్ ప్ర‌స్తుతం అలియా భ‌ట్‌తో క‌లిసి జైపూర్‌లో ఉన్నాడు. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌లో పాల్గొనేందుకు ఆ ప్రాంతానికి వెళ్లారు. వ‌చ్చే ఏడాది ఇద్ద‌రు ఏడ‌డుగులు కూడా వేయ‌నున్నారు.