తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం హన్మకొండలో పర్యటించారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ మాతృమూర్తి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకే ఫాంహౌస్లో చేసిన శనిపూజ ద్రవ్యాలను కాళేశ్వరంలో కలిపేందుకు ఆకస్మిక పర్యటన చేపట్టారని అన్నారు. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రంలో అణుబాంబు పేలుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వెనుక అసలు రహస్యం శనిపూజ కోసమేనన్నారు.
దమ్ముంటే కేసీఆర్ నాతో ఢిల్లీకి రావాలంటూ సవాల్ విసిరారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ పొత్తుల పేరుతో డ్రామాలాడుతున్నారని అన్నారు. పొత్తులపై ఎవరు హామీ ఇచ్చారో తేలుస్తా. కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. రక్తపు మడుగులో రాజ్యం ఏలుతున్న కేసీఆర్తో బీజేపీ ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తుపెట్టుకోదు అంటూ పేర్కొన్నారు. కేసీఆర్పై అసహనంతో మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాపాడుకోవడం కోసమే పొత్తుల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారు. యాక్షన్లో కేసీఆర్ను మించిన నటుడు లేడు. కేసీఆర్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే టేకాఫ్ లేకుండా 20 గంటల్లో షూటింగ్ పూర్తవుతుంది’ అని బండి సంజయ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.