ఎన్నో ఏళ్లుగా వారసత్వంగా వస్తున్నాయన్న సెంటిమెంట్ తో ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వం నడపలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. దీపమ్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అనే అంశంపై చేపట్టిన వెబినార్ లో ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న వేళ మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి.
వ్యాపారం అనేది అసలు ప్రభుత్వ వ్యవహారమే కాదని, నష్టాల్లో ఉన్న సంస్థలు ప్రజా ధనంతో నడుస్తున్నాయని.. అలాంటి వాటిని ప్రైవేటీకరించడమే ఉత్తమమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పీకల్లోతు నష్టాల్లో వున్న అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రజాధనంతో నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ సంస్థల ద్వారా ప్రభుత్వం వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్నారు. అందువల్ల ప్రైవేటికరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని ప్రభుత్వం సంస్థను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవలి కాలంలో పలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలన్న ప్రతిపాదనలను కేంద్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాని మోదీ చెప్పిన దాని ప్రకారం చూస్తే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అవడం ఖాయమనిపిస్తుంది. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించి విశాఖ ఉక్కు మీద ఆశలు వదులుకోవాల్సిందేనా? చూద్దాం.