భారీ ధర పలికిన జాక్‌ తొలి ట్వీట్‌.. ఎంతంటే ?

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులకు కబుర్లు చెప్పేందుకు వచ్చిన సంస్థే ట్విటర్‌. మరి ఈ ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ తొలిసారిగా ట్విట్ చేసిన ట్విట్ ఏంటో తెలుసా?. మార్చి 21, 2006లో తొలి సారిగా ‘‘జస్ట్‌ సెట్టింగ్‌ అప్‌ మై ట్విటర్‌’’ అని జాక్‌ డోర్సీ పోస్టు చేశాడు. ఈ పోస్టు పెట్టి 2021 మార్చి 21నాటికి సరిగ్గా పదిహేను ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ ట్విట్ ప్రత్యేకత ఏంటో తెలుసా?. మీరు ఊహించని ధరకు అమ్ముడుపోవడమే.

Twitter CEO Jack Dorsey First Tweet Sold for 2 9 Million Dollars - Sakshi

ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమైన ట్విటర్‌లో పెట్టిన తొలి ట్వీట్‌ను జాక్‌ డోర్సీ ‘వాల్యుయబుల్స్‌ బై సెంట్‌’ వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని జాక్‌ డోర్సీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. జాక్‌ డోర్సీ 15 ఏళ్ల ట్వీట్ ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటి వరకు పెట్టిన అత్యంత ప్రసిద్ధ ట్వీట్లలో ఇది ఒకటి. ఇప్పటి వరకు లక్షల మంది ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ బిడ్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు దీనికి అందిన అత్యధిక ఆఫర్ 29,15,835.47 డాలర్లు(సుమారు రూ.21 కోట్లు).

ఇంత ధర పెట్టి బ్రిడ్జ్‌ ఒరాకిల్‌ సంస్థ సీఈఓ సీనా ఎస్టావీ దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసిన వారికి ట్విటర్‌ సీఈవో డిజిటల్‌గా ఆటోగ్రాఫ్ చేసిన డిజిటల్ సర్టిఫికెట్‌ను పొందుతారు. ట్విటర్‌ సీఈవో సంతకాన్ని క్రిప్టోగ్రఫీని ఉపయోగించి సంతకం చేస్తారు. ఇందులో అసలు ట్వీట్ యొక్క మెటాడేటాతో పాటు అది పోస్ట్‌ చేసిన సమయం వంటి వివరాలు ఉంటాయి. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బిట్‌కాయిన్‌ రూపంలోకి మార్చి ‘గివ్‌ డైరెక్ట్లీస్‌ ఆఫ్రికా రెస్పాన్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని డోర్సీ ప్రకటించారు. ఈ సంస్థ ఆఫ్రికాలో కరోనా వైరస్‌ కారణంగా భాదపడుతున్న కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది.