శ్వేతసౌధంలోకి వెళ్లగానే 15 కీలక ఆదేశాలపై సంతకం చేసిన బైడెన్

అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్వేతసౌధంలోకి వెళ్లిన జో బైడెన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు జో బైడెన్‌ అధ్యక్షుడి హోదాలో సంతకం చేశారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న కీలక నిర్ణయాలపై బైడెన్‌ ఎన్నికల్లో చెప్పినట్టు వాటిని వెనక్కి తీసుకున్నారు. ఈ విధంగా 15 కీలక కార్యనిర్వాహక ఆదేశాలపై బైడెన్‌ సంతకాలు చేశారు. బైడెన్‌ తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనవి ఒకసారి చూస్తే .. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ప్రతి ఒకరు వంద రోజులపాటు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు, అధ్యక్షుడికి కరోనాపై అప్ డేట్స్ నివేదించే ‘కొవిడ్-19 రెస్పాన్స్ కో ఆర్డినేటర్’ పోస్టు నియామకం కూడా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలుగుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేశారు.

అమెరికా- పారిస్‌ వాతావరణ ఒప్పందంలో బైడెన్‌ నిర్ణయంతో అమెరికా మళ్లీ చేరింది. ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతూ ట్రంప్‌ నిర్ణయం తీసుకోవడాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. మెక్సికో గోడ నిర్మాణంపై బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోడ నిర్మాణానికి నిధుల సమీకరణకు తీసుకొచ్చిన నేషనల్‌ ఎమర్జెన్సీ డిక్లరేషన్‌ను నిలిపివేశారు. గ్రీన్‌ కార్డు జారీలో దేశాలకు పరిమితిని బైడెన్‌ ఎత్తేశారు. ఈ నిర్ణయంతో భారతదేశంతో పాటు ఎన్నో దేశాల వారికి ఉపశమనం కలగనుంది. అమెరికా వీసాల జారీలో ఆంక్షలను క్రమేణ ఎత్తివేసేలా బైడెన్‌ వ్యూహం ఉంది. అమెరికా అభివృద్ధిలో కీలకంగా ఉన్న వలసదారులకు శాశ్వత పౌరసత్వం, నివాసం కల్పిస్తూ బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు. వీటితో జాతి వివక్ష, ముస్లిం దేశాల రాకపోకలపై నిర్ణయాలు ఉన్నాయి.