Jai Amaravati: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా ‘జై అమరావతి’ నినాదాలు మిన్నంటాయి. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక తీర్మానంపై జరిగిన చర్చలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆవేశపూరిత ప్రసంగం చేశారు. అమరావతి ఆవశ్యకతను వివరిస్తూనే, గత ప్రభుత్వ వైఫల్యాలను, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరిని ఆయన ఎండగట్టారు.
నాడు మద్దతు.. నేడు బెంగళూరులో మకాం: రాజధానిపై గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. “గతంలో రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తున్నానని అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్, ఆ తర్వాత మూడు ముక్కలాట ఆడారు” అని ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధించిన ఇంతటి కీలక చర్చ జరుగుతుంటే, బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన జగన్ బెంగళూరులో ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది వ్యక్తిగత అంశం కాదని, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.

రైతుల పోరాట దృశ్యాల ప్రదర్శన: గత ప్రభుత్వ హయాంలో అమరావతిని కాపాడుకోవడానికి రైతులు చేసిన సుదీర్ఘ పోరాటాన్ని లోకేశ్ గుర్తుచేశారు. ఆ సమయంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించిన ఫొటోలను సభలో ప్రదర్శించారు. అమరావతి ప్రజలను, రైతులను మోసం చేసినందుకు జగన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని: “మా ప్రభుత్వ విధానం స్పష్టం.. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ” అని లోకేశ్ పునరుద్ఘాటించారు. అమరావతి అనేది కేవలం భూమి కాదని, అది ఆంధ్రుల ఆత్మగౌరవమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి తాను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు సగర్వంగా ప్రకటించారు.

