Manda Krishna Madiga: దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మరియు న్యాయవ్యవస్థ తీరును తప్పుపట్టారు. మత మార్పిడిని సాకుగా చూపి హక్కులను కాలరాయడం సరికాదని హితవు పలికారు.
రాష్ట్రపతి ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం 1950లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని, అయితే అసలు ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధమని మంద కృష్ణ విమర్శించారు. “ఈ ఉత్తర్వులు వివక్షతో కూడుకున్నవి. దళితుల హక్కులను కాలరాసేలా ఉన్నాయి. న్యాయవ్యవస్థకు, పార్లమెంట్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. మత మార్పిడి ఆధారంగా హోదాలు తొలగించడం కాదు, దేశంలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థనే రద్దు చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
మతం మారినా మారని వివక్ష కుల వ్యవస్థ వల్ల దళితులు పశువుల కంటే హీనంగా చూడబడ్డారని, అత్యంత దారుణంగా నష్టపోయారని ఆయన గుర్తు చేశారు. “మతం మారినంత మాత్రాన దళితులు ఎదుర్కొనే సామాజిక వివక్ష పోదు. సమాజం వారిని ఇంకా దళితులుగానే చూస్తుంది. అలాంటప్పుడు వారి ఎస్సీ హోదాను ఎందుకు తొలగించాలి?” అని ఆయన ప్రశ్నించారు.

బ్రాహ్మణేతర వర్గాలన్నీ బాధితులే! దేశంలోని కుల వ్యవస్థపై మంద కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సామాజిక సామరస్యం: ఈ వ్యవస్థలో ఏ రెండు కులాల మధ్య సరైన సఖ్యత లేదు.
ఆధిపత్యం: అన్ని కులాల మీద ఆధిపత్యం చెలాయిస్తూ, గౌరవం పొందుతున్నది మాత్రం బ్రాహ్మణ వ్యవస్థే.
కుల నిర్మూలన: అసమానతలను కోరుకునే వారే కుల వ్యవస్థ ఉండాలని కోరుకుంటారని, సమానత్వాన్ని కాంక్షించే వారు కుల నిర్మూలన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
రాజకీయ పార్టీలకు సవాల్ అంటరానితనం ఏ వ్యవస్థ నుంచి పుట్టిందో రాజకీయ పార్టీలు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కుల వ్యవస్థ రద్దుపై ప్రతి పార్టీ తమ వైఖరిని బహిరంగంగా వెల్లడించాలన్నారు. కుల వ్యవస్థను రద్దు చేసేందుకు ఏ పార్టీ లేదా సంస్థ ముందుకు వచ్చినా, ఎమ్మార్పీఎస్ తరఫున వారికి అండగా నిలబడతామని మంద కృష్ణ ప్రకటించారు.

