AP Electricity Charges: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు: కూటమి ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ప్రభుత్వం విధించిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రూఅప్ పేరుతో వసూలు చేసిన సుమారు రూ. 923.55 కోట్లను ప్రస్తుతం మినహాయించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఏపీఈఆర్‌సీ (ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయంతో, నవంబర్ నెల నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ (2026) వరకు రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల భారం తగ్గనుంది.

ట్రూడౌన్ అంటే ఏమిటి?
గత ఐదేళ్లుగా ట్రూఅప్‌ పేరుతో ఛార్జీల పెంపు మాత్రమే తెలిసిన వినియోగదారులకు, కూటమి ప్రభుత్వం ట్రూడౌన్ (ఛార్జీల తగ్గింపు) ను పరిచయం చేస్తోందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

ట్రూఅప్ అంటే విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగినప్పుడు ఆ భారాన్ని వినియోగదారులపై ఛార్జీల పెంపు రూపంలో మోపడం.

ట్రూడౌన్ అంటే వినియోగదారుల నుంచి ట్రూఅప్ పేరుతో వసూలు చేసిన మొత్తం కన్నా ఖర్చు తక్కువగా అయినప్పుడు, ఆ మిగిలిన మొత్తాన్ని డిస్కంల నుంచి వసూలు చేసి వినియోగదారులకు తిరిగి సర్దుబాటు చేయడాన్ని ట్రూడౌన్‌ అంటారు.

యూనిట్‌కు 13 పైసలు తగ్గింపు
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను డిస్కంలు రూ. 2,787 కోట్ల ట్రూఅప్‌ కోసం దాఖలు చేయగా, ఏపీఈఆర్‌సీ రూ. 1,863.64 కోట్లకే ఆమోదం తెలిపింది. డిస్కంలు వాస్తవంగా వినియోగదారుల నుంచి వసూలు చేసిన మొత్తం నుంచి ఆమోదం తెలిపిన మొత్తాన్ని మినహాయించగా, మిగిలిన రూ. 923.55 కోట్లను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించింది.

దీంతో ఈ మొత్తాన్ని ట్రూడౌన్‌ ఛార్జీల రూపంలో నవంబర్ 2025 నుంచి అక్టోబర్ 2026 వరకు వచ్చే విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు. ఈ తగ్గింపు ద్వారా యూనిట్‌కు 13 పైసలు చొప్పున వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.

TDP Leader On Balakrishna Comments | Jagan | Telugu Rajyam